ఒకే వారంలో మూడు భాషల్లో మహిళా ప్రధాన చిత్రాలు విడుదలవడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. సెప్టెంబర్ 15న అలాంటి వాతావరణమే ఉంది తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో. ఆ రోజు మూడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'సిమ్రన్'. హన్సల్ మెహతా దర్శకత్వంలో రూపొందిందీ సినిమా. తన తొలి చిత్రం 'గ్యాంగ్స్టర్' లో కంగనా పోషించిన పాత్ర పేరు సిమ్రన్. మళ్లీ అదే పేరుతో ఇప్పుడు ఓ సినిమా చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఎన్నారై సందీప్ కౌర్ జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 'క్వీన్' చిత్రంలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న కంగనా.. 'ఫ్యాషన్', 'రజ్జో', 'రివాల్వర్ రాణి' వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ మెప్పించింది. 'సిమ్రన్' చిత్రం కంగనాకి మరో 'క్వీన్' అవుతుందో లేదో తెలియాలంటే ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే.
ఇక ఇదే శుక్రవారం రాబోతున్న మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'మగళిర్ మట్టుమ్' (ఆడవాళ్లకు మాత్రమే). జ్యోతిక, భానుప్రియ, ఊర్వశి, శరణ్య ప్రధాన పాత్రల్లో నటించారీ సినిమాలో. ముఖ్యంగా ఇది జ్యోతిక సినిమా. 'చంద్రముఖి' చిత్రంలో తన అభినయంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించిన జ్యోతిక.. కథానాయకుడు సూర్యని పెళ్లాడాక సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం తమిళ చిత్రం '36 వయదినిలే'తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతికకి ఆ సినిమా పేరు తెచ్చినా.. ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దాంతో కొత్త చిత్రం 'మగళిర్ మట్టుమ్'పై భారీ ఆశలే పెట్టుకుందీ అభినేత్రి. ఇందులో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా జ్యోతిక కనిపించనుంది. అలాగే మోటర్బైక్ నడిపే సన్నివేశాల్లోనూ కనిపించనుంది. 38 ఏళ్ల తరువాత తన ఫ్రెండ్స్ని కలిసిన అత్తతో పాటు రోడ్ ట్రిప్కి వెళ్తుంది జ్యోతిక. ఆ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలేమిటి? అన్నదే ఈ చిత్ర కథాంశం. బ్రహ్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
ఇదే శుక్రవారం రానున్న మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'శ్రీవల్లీ'. అశోక్ మల్హోత్రా అనే సైంటిస్ట్, మనిషి భావతరంగాలను కొలవగలిగే మిషన్ని తయారు చేస్తాడు. శ్రీవల్లీ అనే అమ్మాయిపై దాన్ని ప్రయోగిస్తాడు. ఈ ప్రయోగం కారణంగా ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? రెండు జన్మల మధ్య ఆమె ఎలాంటి సంఘర్షణకు లోనైంది అనేది చిత్ర కథాంశం. నేహా హింగే టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా కూడా ఈ శుక్రవారమే వెండితెరపైకి రానుంది.
ఒకే రోజున మూడు విభిన్న భాషల్లో వస్తున్న ఈ విభిన్న మహిళా ప్రధాన చిత్రాలు ఎలాంటి ఫలితం సాధిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.