'శివపుత్రుడు', 'అపరిచితుడు' చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన తమిళ కథానాయకుడు విక్రమ్. ఆ తరువాత మాత్రం వరుస పరాజయాలే వరించాయి ఈ టాలెంటెడ్ యాక్టర్ని. గతేడాది ఇదే సెప్టెంబర్లో వచ్చిన 'ఇంకొక్కడు' మాత్రమే కాస్త ఫరవాలేదనిపించుకుంది.
ఇదిలా ఉంటే.. విక్రమ్ ప్రస్తుతం మూడు తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే 'స్కెచ్' (తమన్నా హీరోయిన్), 'ధృవనక్షత్రం' ('పెళ్లిచూపులు' ఫేం రీతూ వర్మ కథానాయిక), 'సామి 2' ('లక్ష్మీ నరసింహా' ఒరిజనల్కి సీక్వెల్.. కీర్తి సురేష్, త్రిష హీరోయిన్స్).
వీటిలో 'ధృవనక్షత్రం' షూటింగ్లో బిజీగా ఉన్నాడు విక్రమ్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇస్తాంబుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ సెట్స్లో విక్రమ్ దిగిన ఫొటోనే ఇది. హేరిస్ జైరాజ్ సంగీతమందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ సినిమా డబ్బింగ్ కానుంది.