టాలీవుడ్ లో మరో విషాదం

Update: 2018-05-16 14:50 GMT

ఈ మధ్య కాలంలో సినీప్రముఖులు తమ అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళుతున్నారు.. మొన్నటికి మొన్న సీనియర్ యాక్టర్ అమృతం హనుమంతరావు మృతిచెందగా.. నేడు అలనాటి ప్రఖ్యాత దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, రామాంతపూర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు..  దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన దేవుడే దిగివస్తే చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేశారు. దుర్గా నాగేశ్వరరావు సినిమా రంగంలోకి కాస్త ఆలస్యంగానే వచ్చారు. దాసరి శిష్యుల్లో దుర్గా నాగేశ్వరరావు కూడా ఒకరు. విజయబాపినీడు నిర్మాణ సారథ్యంలో 1979లో వచ్చిన విజయ చిత్రంతో దర్శకుడుగా మారారు. తర్వాత బొట్టు కాటుక వంటి విజయవంతమైన 14 సినిమాలు చేశారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక బాణీ ఏర్పరచుకున్నారు. 1980ల చివర్లో వచ్చిన కొందరు కొత్త కుర్రాళ్లను ఆయన బాగా ప్రోత్సహించారనే పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా మొదటి తరం నటుల్లో ఒకరు, మహాభారతంలో శకుని పాత్రతో ఫేమస్ అయిన సిఎస్సార్ ఆంజనేయులు కూతురునే దుర్గా నాగేశ్వరరావు పెళ్లి చేసుకున్నారు. 

Similar News