మంత్రి దేవినేని ఉమ తనపై , తన కుమారుడిపై పరోక్షంగా చేసిన విమర్శలపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఘాటుగా ప్రతిస్పందించారు. కంచికచర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ జిల్లాలో హత్యలు చేయించేది, వాటిని ప్రోత్సహించేది ఎవరన్నది ప్రజలందరికీ తెలుసని, వంగవీటి రంగా హత్యలో మాస్టర్ప్లాన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుదేనని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. రోజుకొక పార్టీ మారుతూ, ఆస్తుల కోసం హత్యలు చేసే హంత కులు డబ్బు సంచులతో వస్తున్నారంటూ తనపై, కృష్ణప్రసాద్పై మంత్రి ఉమా కొద్దిరోజులుగా చేస్తున్న ఆరోపణలను వసంత తీవ్రంగా ఖండించారు. మంత్రి దేవినేని ఉమా వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హత్యలు చేసి జైళ్లకెళ్లింది ఉమా కుటుంబీకులేనన్నారు.
దేవినేని ఉమ వదిన ఎలా చనిపోయారో, అందులో ఎవరి హస్తముందో అందరికీ తెలుసని చెప్పారు. కంచికచర్లలో మీడియాతో మాట్లాడుతూ వసంత నాగేశ్వరరావు ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. జలవనరుల శాఖ మంత్రిగా ఉంటూ కూడా... తనకు రాజకీయంగా జన్మనిచ్చిన వీరులపాడు, కంచికచర్ల మండలాలకు సాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఉమ అంటూ మండిపడ్డారు.