టర్కీ, లిబియా, సిరియా దేశాల ప్రజలు దాదాపు 33000మంది దుర్మరణం పాలైనట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. సంక్షోభం కారణంగా తమ ప్రాణాల్ని రక్షించుకునేందుకు మధ్యధరా సముద్రం మీదగా యూరోపియన్ దేశాలకు తరలివెళుతున్నారు. అలా తరలివెళుతున్నవారు మరణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 2000 నుంచి 2016 మధ్య కాలంలో వలస వెళ్లిన 33000 మంది ప్రజలు మధ్యధరా సముద్రంలో జల సమాధి అయ్యారని ఐరాస తెలిపింది. కాబట్టే మధ్యధరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తించినట్టు పేర్కొంది. శరణార్ధులను ఆదుకునే విషయంలో యూరోపియన్ యూనియన్-టర్కీలు ఓ ఒప్పొందాన్ని కుదర్చుకున్నాయని..వాటి ప్రకారమే శరణార్ధుల మరణాల రేటును తగ్గించిగలిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) అభిప్రాయపడింది . యూరోపియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ ఈ వాదనను తప్పుపట్టారు. మధ్యధరా సముద్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 33వేలకు పైమాటే అని అన్నారు. కేవలం 2017లోనే యూరోపియన్ యూనియన్ కు దాదాపు లక్షా 61వేల మంది శరణార్థులు వలస వెళ్లినట్టు ఐవోఎం తెలిపింది. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.