ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పార్టీలన్నీ సన్నాహాల్లో ఉన్నాయి. ఓవైపు హోదా ఉద్యమంలో బిజీగా గడుపుతూనే మరోవైపు సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు తగ్గట్టుగా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని తమకు సానుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నంలో జగన్ తలామునకలైనట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్ సీజన్లో బైటిపార్టీలనుంచి అధికారపార్టీలోకొచ్చి చేరిన వారు కొంత అసంతృప్తితో వున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరి.. ఎటువంటి ప్రత్యేక లబ్ది పొందనివారి విషయంలో ఇటువంటి రూమర్లు పుట్టడం సహజం. కానీ.. బాబు క్యాంపులో కీలక పదవుల్ని ఎంజాయ్ చేస్తూ.. అత్యంత సౌకర్యంగా వున్న కొందరి పేర్లు సైతం ‘జంపింగ్ జపాంగ్’ల జాబితాలో వుండడం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం సోదరుల్లో ఒకరు ఇటీవలే మృతి చెందారు. స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు కొన్నిరోజులుగా గట్టిగా చెబుతున్నారు. ఇటు.. బాబు క్యాబినెట్లో సైతం కొన్ని ‘కోవర్ట్’ ఫేసులున్నాయన్నది తాజా ఊసు. ప్రింట్ మీడియాలో దీనికి సంబంధించి బ్యానర్ కథనాలే వచ్చాయి. కనీసం ఇద్దరు మంత్రులు త్వరలో వైసీపీలోకి జంప్ కావచ్చన్నది సదరు కథనం సారాంశం. మంత్రులుగా వీళ్లిద్దరి పనితీరు మీద విమర్శలు వెల్లువెత్తడం.. సీఎం తరచూ చీవాట్లు పెట్టడం.. వీటినే అసంతృప్తికి కారణాలుగా చెబుతున్నారు. ఈ అసంతృప్తి వార్తల్లో నిజమెంత? బాబు డ్యామేజ్ కంట్రోల్ కి దిగుతారా? అనే అంశాలపై టీడీపీలో ఘాటైన చర్చ నడుస్తోంది.