విజయవాడ: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను గట్టిగా హెచ్చరించారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కారకంపాడు గ్రామంలో మంత్రి పార్థసారథి ఈరోజు పర్యటించారు. అనంతరం విజయవాడకు తిరిగి వెళ్తున్న సందర్భంగా కారకంపాడు గ్రామంలో కొంతమంది రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
గ్రామ రైతులు, ధాన్యం రంగు మారిందని చూపిస్తూ రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని, ప్రైవేట్ వ్యాపారస్తులు రైతుల నుంచి కేవలం రూ.1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని మంత్రికి తెలిపారు.
ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అక్కడి అధికారులను ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యాపారస్తుల లారీలను ఆపి విచారించారు. ప్రైవేట్ వ్యాపారస్తులు రూ.1500కి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అయితే, వాస్తవంగా రైతులకు కేవలం రూ.1200 మాత్రమే చెల్లిస్తున్నట్లు మంత్రి పరిశీలనలో వెల్లడైంది. రైతు సేవా కేంద్ర అధికారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారని స్పష్టమైంది.
మంత్రి ఆదేశాల మేరకు ధాన్యం పరీక్షించే మాయిశ్చరైజర్ యంత్రాన్ని తెప్పించి ధాన్యాన్ని పరీక్షించారు. పై పొరలో రంగు మారినప్పటికీ లోపల బియ్యం నాణ్యత బాగానే ఉందని తేలింది. ఈ అంశంపై మంత్రి జిల్లా కలెక్టర్, డీఎంలతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు రూ.1250కి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు తప్పనిసరిగా రూ.1550 చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి తక్షణ స్పందన, దృఢమైన నిర్ణయాలతో న్యాయం జరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.