నేడు ప్రముఖ నటి లక్ష్మి పుట్టినరోజు
ఈ రోజు ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి పుట్టినరోజు. 70వ దశకంలో దక్షిణాదిన ఓ వెలుగు వెలిగారు.
బెంగళూరు: ఈ రోజు ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి పుట్టినరోజు. 70వ దశకంలో దక్షిణాదిన ఓ వెలుగు వెలిగారు. తెలుగులో ప్రముఖ హీరోలు అందరి సరసన నటించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాళం, హిందీ.. తదితర భారతీయ భాషల్లో లక్ష్మి నటించారు. సినిమా రంగానికే చెందిన ప్రముఖ దర్శక, నిర్మాత, ఎడిటర్, హీరో వై.వి.రావు(యరగుడిపాటి వరద రావు), వై.రుక్మిణిలకు లక్ష్మి 1952, డిసెంబరు 13న మద్రాసులో జన్మించారు. 1975లో లక్ష్మి విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించి, నటిగా ప్రసిద్ధి చెందారు. ఆ సినిమాలో తన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.
లక్ష్మి తండ్రి వై.వి.రావు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తల్లి రుక్మిణి తమిళ నటి. లక్ష్మి అమ్మమ్మ నుంగబాక్కం జానకి కూడా నటే. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి మూడవ తరము నటి. 15 ఏళ్ల వయసులోనే ఆమె సినీరంగంలో ప్రవేశించింది. ఈమె తొలి సినిమా తమిళంలో "జీవనాంశమ్" 1968 లో విడుదలైంది . 1970వ దశకంలో తారగా వెలుగొందిన లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది. ఈమె నటించిన మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, తెలుగులో "మిస్ జూలీ ప్రేమకథ" (1975) గా పునర్నిర్మించారు. జూలీ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు బెంగాళీ సినీ పాత్రికేయ సంఘం "సంవత్సరపు ఉత్కృష్ట నటన" పురస్కారాన్ని అందుకున్నారు. జూలీ చిత్రం తర్వాత లక్ష్మి మరే హిందీ చిత్రంలోనూ నటించలేదు. దక్షిణాది భాషల సినిమాలపైనే దృష్టిపెట్టారు.
1977లో విడుదలైన తమిళ సినిమా శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ లో నటనకు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకొని, ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకొన్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యారు. 1980లలో తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలలో సహాయనటిగా చేశారు. జీన్స్ (1998) చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బామ్మ గానూ, హల్చల్ (2004)లో కరీనా కపూర్ బామ్మగానూ నటించారు. 400కు పైగా సినిమాలు చేసిన లక్ష్మి, రాజకీయాలలో కూడా అడుగుపెట్టారు.
వ్యక్తిగత జీవితం
ఈవిడ మూడుసార్లు వివాహము చేసుకున్నారు. భాస్కర్ (మొదటి భర్త),
మోహన్ (రెండవ భర్త), శివచంద్రన్ (మూడవ భర్త)లను చేసుకున్నారు.
పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధం ద్వారా భాస్కర్ను వివాహం చేసుకున్నారు. ఆయన ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవారు. ఆయన ద్వారా కుమార్తె ఐశ్వర్య 1971లో జన్మించారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని, సహనటుడు మోహన్ను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరూ కూడా కొద్ది కాలంలోనే విడిపోయారు. తర్వాత నటుడు, దర్శకుడు శివచంద్రన్ని పెళ్ళాడారు. కన్నడ నటుడు అనంత్ నాగ్తో కూడా కొద్దికాలం సన్నిహితంగా ఉన్నారు.
పురస్కారాలు
నంది పురస్కారం : ఉత్తమ నటి (శ్రావణ మేఘాలు)
నంది పురస్కారం : ప్రత్యేక బహుమతి (మిథునం)
సైమా అవార్డులు: 2019 ఉత్తమ సహాయనటి ( ఓబేబి)