టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది గులాబీ దళం. ప్రతి జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభల ద్వారా బలాన్ని చూపి ప్రత్యర్థులను టెన్షన్ పెట్టాలని యోచిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఈ సభల ద్వారా ఆ జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ నేతలు ఎండగడుతున్నారు. అంతేకాకుండా సర్కార్ వైఫల్యాలను తూర్పారబడుతున్నారు. కాంగ్రెస్ సభలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో కారులో కలవరం మొదలైంది. కాంగ్రెస్ విమర్శలను ఎప్పటికపుడు తిప్పికొట్టాలని లేని పక్షంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని గులాబీ నేతలు భావిస్తున్నారు. ప్రెస్మీట్ల ద్వారా ఖండించడం కంటే ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టాలని గులాబీ దళం యోచిస్తోంది.
కాంగ్రెస్ బహిరంగ సభలతో అదరగొడుతుంటే తమ సైలెన్స్ తో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయంటున్నారు నేతలు. దీంతో ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు టీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జిల్లాలోనే బహిరంగ సభలు ముందు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభలకు భారీగా జనాన్ని సమీకరించి జనం తమ వెంటే ఉన్నారని సంకేతాలను పంపాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండగ తర్వాత సభలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
అందుకే సంక్రాతి అయిపోగానే భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. జిల్లాల వారిగా వరుస సమావేశాలతో ప్రభుత్వ పనితీరును చాటడంతో పాటు కాంగ్రెస్ నోరు మూయించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా అధికార, ప్రతిపక్షాలు సభలు, కౌంటర్ సభలతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.