రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్లో మాట్లాడిన ఆమె..ఏపీ ఎంపీల నిరసనలకు మద్దతిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఏపీ కోసం టీడీపీ ఎంపీల డిమాండ్లో న్యాయముందన్నారు. అయితే, ప్రభుత్వంలో ఉండి నిరసనలు తెలుపడం సరైన పద్ధతి కాదని ఆమె పరోక్షంగా టీడీపీ ఎంపీలను ఉద్దేశించి పేర్కొన్నారు. కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జీఎస్టీ, నోట్లరద్దుకు తాము మద్దతునిచ్చామని, తెలంగాణకు కేంద్రం మద్దతునివ్వాలని అభ్యర్థించారు. కేంద్రం ఎరువుల సబ్సిడీని నేరుగా రైతులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఫర్టిలైజర్ కంపెనీల విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ ఎందుకు చేస్తోందని అన్నారు. చివరగా ‘జై ఆంధ్రా’ అంటూ కవిత తన ప్రసంగాన్ని కవిత ముగించారు. కాగా బుధవారం రోజు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడుతూ..ఏపీ ఎంపీలకు మద్దతిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయట, లోపల నినాదాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.