గడిచిన రెండేళ్లలో 13మంది మనుషుల ప్రాణాలు తీసిన ఆడపులి 'అవని'ని ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు అంతమొందించారు. శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని యవత్మల్ లో దానిని కాల్చి చంపేశారు. అవనిని కాల్చిచంపేందుకు గత సెప్టెంబర్ లోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాని జాడ కనుగొనేందుకు అటవీ అధికారులు నానాతంటలు పడ్డారు. మూడు నెలలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ 150 మంది అటవీసిబ్బంది గాలింపు చేపట్టారు. షూటర్స్, నిపుణులైన ట్రాకర్స్ ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు, శిక్షణ పొందిన శునకాల సహాయంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టగా ఎట్టకేలకు దొరికింది. అవని 2012లో యవత్మాల్ అడవుల్లో తొలిసారి కనిపించింది. ఆ సమీప ప్రాంతాల్లో రెండేళ్లలో పలు ఘటనల్లో పులి కారణంగా చనిపోయిన 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుఉందని ఎట్టకేలకు పులిని మట్టుపెట్టినందుకు ప్రజలు మిఠాయిలు పంచుకొని, టాపాసులు కాల్చి ఆనందం వ్యక్తంచేశారు.