క్షణాల వ్యవధిలో విద్యార్థులను బస్సు పెనుప్రమాదం నుంచి కాపాడింది ఓ టీచర్. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా భీమక్రోసుపాలెంలో చోటుచేసుకుంది. స్కూలు బస్సు ఎప్పటిలాగానే ఉదయం 7 గంటలకు అద్దంపల్లి, వట్రపూడి గ్రామాల్లోను విద్యార్థులను ఎక్కించుకుని భీమక్రోసుపాలెం గ్రామానికి చేరుకుంది. భీమక్రోసుపాలెంలో మరో 20 మంది విద్యార్థులను ఎక్కించుకోవలసి ఉంది. ఇంతలో డ్రైవర్ అజాగ్రత్త వల్ల రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో విద్యుత్ తీగ తెగి బస్సుపై పడింది. దీనితో షార్ట్ సర్క్యూట్ జరిగి మెరుపులు రావడంతో బస్సులో ఉన్న టీచర్ రాజేశ్వరి అప్రమత్తమై మరో టీచర్ సత్యలక్ష్మి సహకారంతో సెకన్ల వ్యవధిలో విద్యార్థులను బస్సు నుంచి దించేశారు. అంతే కొద్దిసేపటికే బస్సులో మంటలు రావడంతో విద్యార్థుల పుస్తకాలు, భోజనం క్యారేజ్లతో సహా కాలిబూడిదయ్యాయి. పరిస్థితిని గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. అనంతరం బకెట్లతో నీరు వేసి మంటలను అదుపులోకి తెచ్చారు.