భాగ్యనగరంలో ప్రైవేట్ స్కూళ్లు రెచ్చిపోతున్నాయ్. ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయ్. ఒకటి రెండు నెలలు ఫీజు కట్టకపోయినా విద్యార్థులను వివిధ రకాలుగా వేధిస్తున్నాయ్. అంతిటితో ఆగకుండా విద్యార్థులను చితక్కొడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
అశోక్నగర్లోని పీపుల్స్ హైస్కూల్లో దివ్యశ్రీ, ఆమె చెల్లెలు చదువుకుంటున్నారు. ఏడవ తరగతి చదువుతున్న దివ్య శ్రీ తల్లిదండ్రులు నవంబర్, డిసెంబర్ ఫీజులు చెల్లించలేదు. దీంతో ప్రిన్సిపల్ వరలక్ష్మి స్కూల్లో కనిపించిన ప్రతిసారి దివ్య శ్రీ, ఆమె చెల్లెల్ని ఫీజు కట్టాలంటూ వేధించేది. అక్కడితో ఆగని వరలక్ష్మి నీకు, మీ మమ్మీకి సిగ్గు లేదా ? ఫీజు ఎప్పుడు కడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలోనే కడతామని చెప్పినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. కట్టే విరిగిపోయేలా విద్యార్థినిని కొట్టింది.
దెబ్బలు తిన్న అదే రోజు రాత్రి దివ్య శ్రీకి నొప్పి ఎక్కువ కావడంతో ఏడుస్తూ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ను నిలదీశారు. వీరితో పాటు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు వచ్చి స్కూల్ వద్ద ఆందోలనకు దిగారు. ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలంటూ బైఠాయించారు. తల్లిదండ్రులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆందోళనతో స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ వరలక్ష్మిని సస్పెండ్ చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది.