'ఖైదీ నెం.150'తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు తన 151వ చిత్రాన్ని స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చేస్తున్నారు. 'సైరా నరసింహారెడ్డి' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం గత నెల లాంఛనంగా ప్రారంభమయ్యింది. అలాగే చిరు పుట్టినరోజున ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. సంగీత దర్శకుడు థమన్ నేపథ్య సంగీతంతో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ అభిమానుల్ని అలరించింది.
అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని వచ్చే నెల 20న ప్రారంభించనున్నారని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని నానక్రామ్ గూడ స్టూడియోలో ఆర్ట్డైరెక్టర్ రాజీవన్ నేతృత్వంలో ఓ భారీ సెట్ని నిర్మిస్తున్నారు. అక్కడే ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. 'ఖైదీ నెం.150'ని నిర్మించిన కథానాయకుడు రామ్చరణ్నే ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.