రాశి కంటే వాసికే ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు సురేందర్ రెడ్డి. జయాపజయాల సంగతి పక్కన పెడితే.. 12 ఏళ్ల కెరీర్లో 8 చిత్రాలకే పరిమితమయ్యాడు. కెరీర్ ప్రారంభంలో సంవత్సరానికో సినిమా అన్నట్లుగా ఉన్న సూరి.. తరువాత రెండేళ్లకో సినిమా అన్నట్లుగా తన శైలిని మార్చుకున్నాడు. అయితే 2014లో వచ్చిన 'రేసు గుర్రం' తరువాత వరుసగా 'కిక్ 2' (2015), 'ధృవ' (2016) చిత్రాలు చేసి.. మళ్లీ సంవత్సరానికో సినిమా అంటూ పాత రూటునే ఎంచుకున్నాడు.
ఇదిలా ఉంటే.. గతేడాది చివరలో వచ్చిన 'ధృవ' తరువాత చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చేస్తూ బిజీగా ఉన్నాడు సురేందర్ రెడ్డి. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా.. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే.. ఈ ఏడాదిలో సురేందర్ రెడ్డి సినిమా లేనట్టే. ఏదేమైనా.. గత మూడేళ్లుగా ఏడాదికో సినిమా అన్నట్లుగా ఉన్న సురేందర్ శైలి మళ్లీ రెండేళ్లకో సినిమా అన్నట్లుగా మారుతోందన్నమాట.