'నిన్నే పెళ్లాడుతా', 'చంద్రలేఖ', 'ప్రేమకథ', 'సూపర్', 'బుజ్జిగాడు', 'జోష్.. ఈ పేర్లు వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు సందీప్ చౌతా. ఫలితాలు ఎలాంటివి అయినా ఆయా సినిమాల్లో సందీప్ సంగీతానికి మంచి మార్కులు పడ్డాయి. ఏడేళ్ల క్రితం విడుదలైన నాగార్జున చిత్రం 'కేడి' తరువాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సందీప్ చౌతా.. మళ్లీ తెలుగు సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో 'సూపర్', 'బుజ్జిగాడు' వంటి చిత్రాలను సందీప్ కాంబినేషన్లో చేసిన పూరీ జగన్నాథ్నే తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పూరీ తనయుడు ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. సందీప్ తెలుగులో కంటే హిందీ సినిమాలకే ఎక్కువగా పనిచేశాడు.