జగన్‌పై దాడి కేసులో కీలక సమాచారం...పది నిమిషాల్లో జగన్‌ను చంపేస్తానంటూ ఫోన్

Update: 2018-10-31 06:32 GMT

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి చేసిన కేసు విశాఖ నుంచి ప్రకాశం జిల్లా మీదుగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చేరుకుంది. కాల్ డేటా ఆధారంగా తీగ లాగుతున్న సిట్ అధికారులు డొంక కదిలిస్తున్నారు. దాడికి ముందు శ్రీనివాసరావు ఫోన్ చేసిన నెంబర్లపై దృష్టి సారించిన పోలీసులు  పలువురు అనుమానితులను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ చివరి సారిగా ఫోన్ చేసిన నెంబర్‌ ఆధారంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరిని వీరిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు .

శ్రీనివాసరావు కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు  ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ మహిళతో ఎక్కువగా మాట్లాడినట్టు గుర్తించారు. ఇదే చివరి కాల్ కూడా కావడంతో అనుమానంతో విచారణ ప్రారంభించారు.  మహిళ వినియోగించిన సిమ్ కార్డు మరోకరి పేరు మీద ఉండటంతో  వేర్వేరుగా విచారణ ప్రారంభించారు. అయితే ఈ సిమ్ కార్డు వినియోగించిన మహిళ  తమ్ముడి పేరు మీదే ఉండటంతో ఈ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన తమ్ముడి భార్య నుంచి సెల్ తీసుకున్నట్టు చెప్పడంతో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విశాఖ తరలించి విచారణ ప్రారంభించారు. 

జగన్‌పై దాడి చేసే ముందు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మహిళకు ఫోన్ చేసిన శ్రీనివాస్ కాసేపట్లో  ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి చేస్తున్నట్టు చెప్పాడు. కావాలంటే టీవీలో వార్తలు చూసుకోవాలంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు.  చెప్పింది చెప్పినట్టే చేయడంతో ఆందోళన చెందిన మహిళ ఎవరికి తెలియకుండా ఫోన్‌ను ఇంట్లో ఓ డబ్బాలో దాచి పెట్టింది. నెట్ వర్క్ సాయంతో ట్రేస్ చేసిన సిట్ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. 

Similar News