ఢిల్లీలో ఒక్కసారిగా దేశ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస యుద్ధం ప్రకటించడంతో మోడీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ప్రకటించిన పలు పార్టీలు లోక్సభలో అండగా నిలిచాయి. అయితే అవిశ్వాస తీర్మానాలపై నోటీసులు అందాయని ప్రకటించిన లోక్సభ స్పీకర్ సభ ఆర్డర్లో ఉంటే టేకప్ చేస్తామన్నారు. అయితే విపక్ష సభ్యులు ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో సభను సోమవారానికి వాయిదావేశారు లోక్సభ స్పీకర్.
కేంద్రంపై అవిశ్వాస యుద్ధం ప్రకటించిన టీడీపీ, వైసీపీలు పార్లమెంట్లో ఆందోళన కొనసాగించారు. ఏపీ ఎంపీల నిరసనలతో ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మరోసారి ప్రారంభమైన లోక్సభలో మళ్లీ ఆందోళనలు కంటిన్యూ చేశారు. అయితే టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాల నోటీసులు అందినట్లు ప్రకటించిన లోక్సభ స్పీకర్ వాటిని చదివి వినిపించారు. రెండు నోటీసులను ఒకేసారి పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే సభ ఆర్డర్లో ఉంటేనే టేకప్ చేస్తామని తెలిపారు. కానీ సభ కంట్రోల్లోకి రాకపోవడంతో లోక్సభను సోమవారానికి వాయిదావేశారు.
కేంద్ర ప్రభుత్వ తీరుతో రగిలిపోతూ ఎన్డీఏ నుంచి కూడా బయటికొచ్చిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో ఆందోళన నిర్వహించింది. ఉభయ సభల్లోనూ వెల్లోకి దూసుకొచ్చిన టీడీపీ ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్డీఏకి తలాక్... తలాక్... తలాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్డీఏ నుంచి సైతం బయటికొచ్చిన టీడీపీ కేంద్రంపై తన పోరును మరింత పెంచింది.