'మన్మథ', 'వల్లభ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ కథానాయకుడు శింబు. ప్రముఖ తమిళ దర్శకుడు టి.రాజేందర్ తనయుడు అయిన శింబు.. ఇటీవలే 'సరసుడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించనున్న మల్టీస్టారర్ మూవీలో ఓ ప్రధాన పాత్రకి శింబు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం బాగా మేకోవర్ అయ్యాడీ యువ కథానాయకుడు.
తన గత చిత్రం 'అన్బనవన్ అసరధవన్ అడంగదవన్' కోసం కాస్త బొద్దుగా కనిపించిన శింబు.. తాజా చిత్రం కోసం సన్నగా, స్టైలీష్గా తయారయ్యాడు. ఇక్కడ చూస్తున్న స్టిల్లో అతని కొత్త లుక్ చూడొచ్చు. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న మణిరత్నం చిత్రంలో అరవింద్ స్వామి, జ్యోతిక, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేష్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించనున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించనున్నారు.