కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారి నెత్తురోడింది. మానకొండూరు మండలం చెంజర్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వస్తుండగా లారీ- బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణీకులతో పాటు లారీ డ్రైవర్ మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. బస్సును ఓవర్ టేక్ చేయబోయిన లారీ అదుపుతప్పి బస్సును ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు కుడి భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణీకులను చుట్టుపక్కల వారు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ హుటాహుటినా ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదం సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్ధితులను చక్కదిద్దాలంటూ మంత్రి ఈటల రాజేందర్ను ఆదేశించారు.