రేపటి నుంచి హైదరాబాద్లో పుస్తక ప్రియుల పండుగ
నగరంలోని పుస్తక ప్రియులకు పండుగొచ్చింది. ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 38వ ఎడిషన్గా జరుగనుంది.
హైదరాబాద్: నగరంలోని పుస్తక ప్రియులకు పండుగొచ్చింది. ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 38వ ఎడిషన్గా జరుగనుంది. సాహితీ అభిమానులు ఎదురుచూసే ఈ పుస్తకాల పండుగ వివరాలను బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ షేక్, కార్యదర్శి ఆర్.వాసు తెలిపారు. ఈ ఏడాది బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ కవి అందెశ్రీ పేరు పెట్టారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్లో సందర్శకులకు ప్రవేశం ఉంటుంది. మొత్తం 365 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలకు ప్రవేశ రుసుము రూ.10. విద్యార్థులకు, వారితో వచ్చే ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు చూపిస్తే ఉచిత ప్రవేశం కల్పిస్తారు. ఈ బుక్ ఫెయిర్ జరిగే పది రోజుల్లో సుమారు 50 కొత్త పుస్తకాలు ఈ వేదికల మీద నుంచి ఆవిష్కరించనున్నారు.గతేడాది 10 లక్షల మంది సందర్శించగా, ఈసారి 12 నుంచి 15 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా.
చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు బాలోత్సవ్ పేరుతో చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డ్రగ్స్ నివారణ, మొబైల్ ఫోన్ అతిగా వాడటం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా స్కిట్స్ ప్రదర్శిస్తారు.
ప్రముఖ రచయితలతో ముఖాముఖి
ప్రముఖ రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు, వారిని ప్రభావితం చేసిన పుస్తకాలపై చర్చలు జరుగుతాయి. పాఠకులకు కొత్త అనుభూతులను అందిస్తాయి. పుస్తక పఠనంతో పాటు తెలంగాణ రుచులను ఆస్వాదించేందుకు నాణ్యమైన ఆహారంతో ఫుడ్ కోర్టులను సిద్ధం చేశారు. పిల్లల కోసం ‘కిడ్స్ ప్లే ఏరియా’, తల్లిదండ్రులు కూర్చోవడానికి సిట్టింగ్ గ్యాలరీలు కూడా ఉన్నాయి. 38 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను జయప్రదం చేయాలని, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.