మొత్తం 3 రాజ్యసభ సీట్లు. అందులో ఒకటి కన్ఫార్మ్ అయిపోయింది. ఇంకో రెండు మిగిలాయి. ఈ రెండింటిలో ఒకటి యాదవులకు రిజర్వ్ అయ్యింది. కానీ వాళ్లలో ఎవరికి ఇస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మిగిలిన ఒక సీటు కోసం పోటీ చాలానే ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్లో ఆ రెండు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయనేదే హాట్ టాపిక్గా మారింది.
టీఆర్ఎస్లో ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థులపైనే హాట్ టాపిక్ నడుస్తోంది. మొత్తం 3 సీట్లలో ఒకటి సంతోష్కు కన్ఫార్మ్ అయిపోయింది. మిగతా రెండు సీట్లపైనే ఇప్పుడందరి ఆశలు. అధినేత కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఇప్పుడంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మిగిలిన 2 సీట్లకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై గులాబీ బాస్ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
యాదవ సామాజిక వర్గం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపిస్తామని సీఎం కేసీఆర్ గొల్ల,కురుమల బహిరంగ సభలో చెప్పారు. అందుకనుగుణంగా యాదవ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. యాదవుల నుంచి రాజయ్య యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన గొర్రెల పెంపకం అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఉన్నారు. మరొకరు నోముల నర్సింహ్మయ్యతో పాటు కల్వకుర్తి నేత జైపాల్ యాదవ్ పేరు లిస్టులో ఉంది. వీరిలో రాజయ్య యాదవ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మరో సీటుపై మిగతా సామాజిక వర్గాలు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయా నేతలు గులాబీ బాస్ను కలిసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. మరికొందరు కేసీఆర్ సన్నిహితులతో పైరవీలు కూడా మొదలెట్టేశారు. ఇప్పటికే ఎస్సీ కోటా కింద పాలమూరు నేత మాజీ ఎంపీ మంద జగన్నాథం పేరు పరిశీలనలో పెట్టారు. ఇప్పటికే ఆయన కేసీఆర్ను కూడా కలిశారు. ఇక టీడీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీలో చేరేటప్పుడే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని కేసీఆర్ హామి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వీళ్లతో పాటు వనపర్తికి చెందిన నిరంజన్ రెడ్డి పేరు కూడా రాజ్యసభ రేసులో ఉంది. కేసీఆర్కు సన్నిహితుడు, నమ్మకస్తుడు, సీనియర్ నేత అయిన నిరంజన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.