అమెరికా రష్యా, మధ్య స్నేహపూర్వక వాతావరణం నింపడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగిన వ్యక్తిగత భేటీలో పలు అంశాలపై ఇరుదేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్లు చర్చించుకోగా.. భేటీ అంత సానుకూలంగా జరగలేదన్న అభిప్రాయం ఇరు దేశాల ప్రజల్లో ఏర్పడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ తో మరోసారి భేటీ కావాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో పుతిన్ ను అమెరికాకు ఆహ్వానించారు. 'హెల్సింకీలో జరిగిన భేటీలో చర్చించిన అంశాలను అమలుచేసేందుకు మరోసారి పుతిన్తో సమావేశం అవుతాం. ఇందుకోసం పుతిన్ను అమెరికాకు ఆహ్వానిస్తున్నాం' అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అనంతరం వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మరో ట్వీట్ చేశారు. 'హెల్సింకీలో జరిగిన భేటీలో.. ఇరుదేశాల ఉన్నత స్థాయి భద్రతాధికారుల సమావేశం జరగాలని ట్రంప్ సూచించారు. దీనికి పుతిన్ అంగీకరించినట్టు శాండర్స్ ట్వీట్ లో పేర్కొన్నారు.