Pakistan Lockdown: పాకిస్తాన్ లో స్మార్ట్ లాక్డౌన్..స్కూళ్లకు సెలవులు
Pakistan Lockdown: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో స్మార్ట్ లాక్డౌన్ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు
Pakistan Lockdown
Pakistan Lockdown: ఆర్థిక సంక్షోభంతో పాటు, పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు తీవ్రమైన ఫ్యూయల్ కష్టాల్లో పడిపోయారు. ఫారెక్స్ నిల్వలు తక్కువగా ఉండడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి పెట్రోల్ మరియు డీజిల్ దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. రాబోయే 2 వారాల పాటు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల రవాణాకు ఉపయోగించే ఇంధనాన్ని ఆదా చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కూడా తప్పనిసరి చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం స్మార్ట్ లాక్డౌన్ను పరిశీలిస్తోందని సింధ్ ప్రావిన్స్ స్థానిక ప్రభుత్వ శాఖ మంత్రి నాసిర్ హుస్సేన్ షా మీడియాతో అన్నారు. ఈ లాక్డౌన్ ద్వారా, అనవసర రవాణాను నిషేధించి దేశంలో ఇంధన సరఫరాను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. ఇంధన ధరలు నిరంతరం పెరగడం వల్ల సామాన్య పౌరుల పరిస్థితి దుర్భరంగా మారింది.
సంక్షోభంలో పాకిస్తాన్ ఎయిర్లైన్స్..
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. జెట్ ఇంధనం ధరలు ఇదే విధంగా పెరుగుతూ ఉంటే, ఎయిర్లైన్ను మూసివేయవలసి రావచ్చని PIA కన్సార్టియం ఛైర్మన్ ఆరిఫ్ హబీబ్ అన్నారు. గత కొన్ని రోజులుగా జెట్ ఇంధనం (JP-1) ధర చాలా వేగంగా పెరిగింది. మార్చి 21 నుండి, దీని ధర లీటరుకు రూ. 388 నుండి రూ. 472 కు పెరిగింది. అంటే రూ. 84 లేదా సుమారుగా 21.65 శాతం పెరుగుదల నమోదైంది.
గతంలో లీటరుకు రూ.190గా ఉన్న జెట్ ఇంధన ధర, మార్చి 1 నుంచి సుమారు 150 శాతం పెరిగింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ పెరుగుదల జరిగిందని చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో నెలకొన్న అనిశ్చితే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల పిఐఏ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ విమానయాన సంస్థ కార్యకలాపాలు నిర్వహించడం కష్టతరం కావచ్చు.
అత్యవసర సేవలు మాత్రం..
పాకిస్తాన్లో ఆసుపత్రులు, ఫార్మసీలు, ఇతర అత్యవసర ప్రభుత్వ సేవలు తెరిచే ఉంటాయి. ఇది కాకుండా, అత్యవసర ప్రయాణాలు, సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వే స్టేషన్లు కూడా పనిచేస్తూనే ఉంటాయి. లాక్డౌన్ సమయంలో నగరాల మధ్య రోడ్లు, హైవేలు, మోటర్వేలు మూసివేస్తారని, సాధారణ వాహనాల రాకపోకలు కూడా ఉండవని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ప్రజల అత్యవసర ప్రయాణాలు కొనసాగేందుకు వీలుగా ప్రజా రవాణా బస్సులకు అనుమతి ఇస్తున్నారు.
దీంతో పాటు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను వీలైనంత త్వరగా రిజిస్టర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వం అవసరమైన వారికి నేరుగా సబ్సిడీలు అందించగలుగుతుంది. దేశంలో చమురు కొరతను పరిష్కరించేందుకు, కీలక వనరులను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.