'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన 'సాహో' అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాకీ ష్రాఫ్, మందిరా బేడి, నీల్ నితేష్ ముఖ్, మహేష్ మంజ్రేకర్, లాల్ వంటి భారీ తారాగణంతో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇదిలా ఉంటే.. 'సాహో' తరువాత 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. అదేమిటంటే.. 1960, 70 నాటి ప్రేమకథ చిత్రంగా ఈ సినిమా రూపొందనుందని, యూరప్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలిసింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతమందించనున్నారు.