2019లో మాదే ప్రభుత్వం-పవన్‌కల్యాణ్‌

Update: 2018-05-20 12:31 GMT

ఏపీలో కొలువుదీరేది జనసేన ప్రభుత్వమేనన్నారు పవన్‌కల్యాణ్‌. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాటయాత్ర చేస్తున్నాన్నారు. పెద్దల ఆశీస్సులతో, యువత మద్దతుతో, అక్కాచెల్లెళ్ల తోడుతో 2019 కి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన కోసమే జనసేన పోరాట యాత్ర చేపట్టినట్లు పవన్‌ తెలిపారు. జనసేన మన సంస్కృతిని కాపాడే పార్టీ అని.. మిగతా పార్టీల మాదిరిగా కులాలను విడదీయడం తమ పార్టీ సంస్కృతి కాదన్నారు. జనసేన ప్రజల ముందుకొచ్చింది ఓట్లు అడగటానికి కాదని.. సమస్యలు తెలుసుకోవడానికని పవన్‌కల్యాణ్‌ వివరించారు.

శ్రీకాకుళం దేశభక్తికి, కష్టానికి ప్రతీక అని పవన్‌ కొనియాడారు. ఉద్దానం సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా.. అది అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. శ్రీకాకుళంలో వలసలు నియంత్రించే బాధ్యతను తాను తీసుకుంటాన్నానని తెలిపారు. తాను హామీలు ఇవ్వడానికి రాలేదని, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే యాత్ర చేపట్టినట్లు చెప్పారు పవన్‌ కల్యాణ్‌.

Similar News