తెలుగులో విజయం సాధించిన 'మన్మథుడు' చిత్రం కన్నడలో 'ఐశ్వర్య' పేరుతో రీమేక్ అయితే.. అందులో టైటిల్ రోల్లో సందడి చేసింది నేటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే. ఉపేంద్ర హీరోగా నటించిన ఆ సినిమా 2006లో విడుదలై మంచి విజయమే సాధించింది. అయితే.. దీపికా నటజీవితాన్ని మార్చింది మాత్రం 2007లో విడుదలైన 'ఓం శాంతి ఓం'. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పరా ఖాన్ దర్శకత్వం వహించారు. 2007, నవంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో.. దీపికా ఇక వెనకకు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
హిందీలో టాప్ హీరోయిన్ అనిపించుకోవడమే కాకుండా.. హాలీవుడ్లోనూ సినిమా చేసే స్థాయికి ఎదిగింది దీపికా. ఇదిలా ఉంటే.. ఈ నవంబర్ 9కి దీపికా బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తవుతోంది. సరిగ్గా ఈ సందర్భంలోనే ఆమె కొత్త చిత్రం 'పద్మావతి' నవంబర్ 17న విడుదలకి సిద్ధమైంది. అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న ఈ చిత్రం.. పదేళ్ల కెరీర్ని పూర్తిచేసుకుంటున్న సందర్భంలో దీపికాకి ఓ కానుకగా భావించవచ్చేమో. 'పద్మావతి'లో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, అదితిరావ్ హైదరీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.