ఎ.ఆర్.మురుగదాస్..సందేశాన్ని జోడించి యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన తమిళ దర్శకుడు పేరిది. 'గజిని', 'స్టాలిన్', 'తుపాకి' వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన ఈ దర్శకుడు ప్రస్తుతం మహేష్బాబుతో తెలుగు, తమిళ్ భాషల్లో 'స్పైడర్'ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో విజయ్తో చేయనున్నాడు ఎ.ఆర్.మురుగదాస్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన 'తుపాకి', 'కత్తి' చిత్రాలు మంచి విజయం సాధించాయి. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న వీరి ఈ హ్యాట్రిక్ ప్రయత్నం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుందని సమాచారం. విశేషమేమిటంటే.. 'తుపాకి', 'కత్తి' చిత్రాలు కూడా దీపావళికే ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ముచ్చటగా మూడోసారి కూడా దీపావళికే రానున్న ఈ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.