ఆస్కార్.. ప్రపంచ చలన చిత్ర సీమ ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం పేరిది. ప్రతి ఏటా ఫిబ్రవరి నిర్వహించే ఈ అంతర్జాతీయ పురస్కారాల వేడుకకి.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఓ భారతీయ సినిమా ఎంపికైంది. ఆ చిత్రమే 'న్యూటన్'. రాజ్కుమార్ రావ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ హిందీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరిగ్గా ఈ రోజే ఈ సినిమా ఆస్కార్ కి ఎంపికైందనే వార్త రావడం విశేషం.
దీనిపై రాజ్కుమార్ రావ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'ఈ సంవత్సరం ఆస్కార్ ఎంట్రీకి భారత్ నుంచి 'న్యూటన్' సినిమా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు' అంటూ చెప్పుకొచ్చారు. ఆస్కార్ ఇండియా జ్యూరీ ఛైర్మన్ సి.వి. రెడ్డి, సభ్యులు.. మొత్తం 26 చిత్రాలను చూసి అందులో నుంచి 'న్యూటన్'ని ఎంపిక చేశారు. ఆ 26 చిత్రాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘బాహుబలి 2’వంటి తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి.
'భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓ ఉద్యోగి తెచ్చిన మార్పు'ని ఇతివృత్తంగా చేసుకుని 'న్యూటన్' సినిమాని రూపొందించారు దర్శకుడు అమిత్ వి. మసుర్కర్.