రేవంత్ రెడ్డి నివాసాలపై ఐటీ దాడులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా తెరపైకి వచ్చిన రణధీర్ రెడ్డి అరెస్ట్ విషయంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. నగదు, బంగారంతో వెళుతుండగా రణధీర్ను తామే పట్టుకున్నట్టు ఉప్పల్ పోలీసులు చెబుతున్నారు. రణధీర్ నిన్నంతా తమ అదుపులోనే ఉన్నాడని చెప్పిన ఉప్పల్ పోలీసులు ఉదయ్ సింహకు చెందిన రెండు బ్యాగులను తీసుకెళుతుండగా పట్టుకున్నట్టు ప్రకటించారు. రణధీర్ నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగుల్లో 12 తులాల బంగారం, లక్షా 94 వేల నగదు, హార్ట్ డిస్క్ ఉన్నట్టు తెలిపారు. పట్టుబడిన డబ్బుకు లెక్కలు చెప్పాలని కోరితే సమయం కావాలని కోరినట్టు చెప్పారు. సెక్షన్ 102 కింద కేసులు చేసిన అనంతరం వివరణ ఇచ్చేందుకు మూడు రోజుల సమయం ఇచ్చినట్టు తెలిపారు.