అమ్మ ఒడికి చేరిన చిన్నారులు

Update: 2017-12-12 07:04 GMT

నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో తారుమారయిన చిన్నారుల కేసు కొలిక్కి వచ్చింది. డీఎన్‌ఎ టెస్ట్‌లు చేసిన వైద్యులు నివేదిక రావడంతో చిన్నారులను వారి తల్లులకు అప్పగించారు. శిశువులను తీసుకోగానే తల్లిదండ్రులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏఎస్‌ రావు నగర్‌కు చెందిన అఖిల, ఎల్బీ నగర్‌కు చెందిన మనీషాలకు ఈ నెల 29న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్యులు డెలీవరీ చేశారు. అఖిల, మనీషాలిద్దరికి మగపిల్లలే పుట్టారు. పుట్టిన తర్వాత చిన్నారులకు సిబ్బంది ట్యాగ్‌లు వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నించడంతో గ్రహించిన అఖిల, శివకుమార్ దంపతులు సిబ్బందిని నిలదీశారు. 

అఖిల, మనీషాలిద్దరూ పిల్లల తారుమారుపై సిబ్బందితో గొడవకు దిగారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగడంతో వివాదం కాస్తా పెద్దదయింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని చిన్నారులిద్దరికి డీఎన్‌ఎ టెస్ట్‌లు నిర్వహించారు. ఇవాళ రిపోర్ట్‌ రావడంతో వారి తల్లులకు అప్పగించారు.

Similar News