'ముని', 'కాంచన', 'గంగ'.. పేర్లు వేరు అయినా ఈ మూడు సినిమాల నేపథ్యం, కథానాయకుడి పాత్ర తీరు ఒకటే. రాఘవ లారెన్స్ తానే నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రాలు తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్కి నాలుగో పార్ట్ సిద్ధమౌతోంది. 'కాంచన 3' పేరుతో తమిళంలో ఇవాళే పూజా కార్యక్రమాలను జరుపుకుందీ చిత్రం. తెలుగులోనూ ఇదే పేరు ఉంటుందా? మారుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. 'ముని'లో వేదిక, 'కాంచన'లో లక్ష్మీ రాయ్, 'గంగ'లో తాప్సీ, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో పార్ట్లో మొదటి పార్ట్ 'ముని'లో నటించిన వేదికనే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే వేదికకి ఇది మంచి అవకాశమే. ఇక మొదటి మూడు భాగాల్లోనూ లారెన్స్కి అమ్మగా నటించిన కోవై సరళ ఈ చిత్రంలోనూ కొనసాగనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారకంగా వెల్లడవుతాయి.