మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఎవడే సుబ్రమణ్యం'తో విమర్శకుల ప్రశంసలు పొందిన నాగ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఇతర ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్బాబు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్వీఆర్ లాగే విలక్షణ పాత్రలకు పెట్టింది పేరైన మోహన్బాబు.. ఆ పాత్రకు న్యాయం చేస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న 'మహానటి'.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.