దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన 'ఓకే బంగారం'తో మళ్లీ ఫామ్లోకి వచ్చారు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం. అయితే ఆ తరువాత కార్తీతో తెరకెక్కించిన 'చెలియా' నిరాశపరిచింది. ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు మణిరత్నం.
మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 25 ఏళ్లుగా మణిరత్నం వరుస చిత్రాలకు సంగీతమందిస్తున్న ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి కూడా స్వరాలు అందించనున్నారు. ఈ సినిమాకి ప్రముఖ కెమెరామేన్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించనుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టుతున్నారు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.