తెలంగాణలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయ్. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమమున్నప్పటికీ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ని లోఫర్ పార్టీ అన్నారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు అంతే ధీటుగా కౌంటరిచ్చారు.
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పొలిటికల్ డైలాగ్లు పేలుస్తున్నారు. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ పార్టీ లోఫర్ పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అహాంకారం, డబ్బు, పదవి, మదమెక్కి కేటీఆర్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గూగుల్లో కేటీఆర్ అని కొడితే దోపిడి దొంగ అని వస్తోందన్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా ధీటుగా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ లత్కోర్ పార్టీని దీన్ని నడుపుతున్నది ఛీటర్స్ మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఛీటర్సేనని కుటుంబమంతా అబద్దాలు చెప్పి బతుకుతున్నారని విమర్శించారు. నిజం మాట్లాడితే తల ముక్కలవుతుందా అంటూ ప్రశ్నించారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నువ్వెంత ? నీ బతుకెంత అని కేటీఆర్లా దిగజారి మాట్లాడలేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పరిస్థితి సినిమాల్లో చిట్టినాయుడిలా తయారైందంటూ వ్యంగాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్. గతంలో టీఆర్ఎస్ పార్టీ గురించి ఎర్రబెల్లి దయాకర్రావు, గుత్తా సుఖేందర్రెడ్డిలు ఏమన్నారో గుర్తు చేశారు. మొత్తానికి తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్వార్ నడుస్తోంది. ఎన్నికలకు ముందు ఇలా ఉంటే ఎన్నికలొస్తే ఎలాంటి డైలాగ్లు పేలుతాయో వేచి చూడాలి.