కేరళలో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే...తక్షణ సాయం కింద ఐదు వందల కోట్లు విడుదల
గడచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కకావికలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తక్షణ సాయం కింద రాష్ట్రానికి ఐదు వందల కోట్ల సాయాన్ని ప్రకటించారు. దీంతో పాటు వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అరగంట పాటు హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన వరద నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం పిసరయి విజయన్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రానికి 20 వేల కోట్ల నష్టం వాటిల్లిదంటూ అధికారులు ప్రధానికి వివరించారు.