'చంద్రముఖి' చిత్రంలో జ్యోతిక నటనని అంత సులభంగా మరిచిపోలేం. కథానాయకుడు సూర్యని పెళ్లాడిన తరువాత జ్యోతిక సినిమాలని తగ్గించుకుంది. పిల్లలు దియా, దేవ్ కాస్త పెద్ద వాళ్లు కావడంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. రెండేళ్ల క్రితం '36 వయదినిలే' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేసిన జ్యోతిక.. ప్రస్తుతం 'మగళిర్ మట్టుమ్' (ఆడవాళ్లు మాత్రమే), 'నాచియార్' అనే తమిళ సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో 'మగళిర్ మట్టుమ్' ఈ నెల 15న విడుదల కానుండగా.. బాల దర్శకత్వంలో నటిస్తున్న 'నాచియార్' చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉండగా.. జ్యోతిక మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించనున్న కొత్త చిత్రంలో జ్యోతిక ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం. ఇంతకుముందు మణిరత్నం నిర్మించిన 'డుమ్ డుమ్ డుమ్' సినిమాలో జ్యోతిక నటించింది. అతని దర్శకత్వంలో జ్యోతిక నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.