మటన్ షాపునకు వెళ్లుతున్నారా ? ఆ మటన్ షాపులో మటన్ కొనుక్కోవాలంటే కచ్చితంగా వెంట బాక్స్ను తీసుకెళ్లాల్సిందే. ఒక వేళ బాక్స్ తీసుకోకుండా మటన్ తెచ్చుకోవాలంటే కష్టమే. ఎందుకంటే ఆ షాపు యజమాని మంసాన్ని కవర్లో పెట్టి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాడు. ఇంతకీ ఎవరతను ?
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటూ ఎంతో మంది చెబుతున్నారు. అందరూ మాటలకే పరిమితమయ్యారు తప్పా పాటించేందేకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఈ మటన్ షాపు నిర్వాహకుడు మాత్రం ప్లాస్టిక్ నిషేధానికి నడుం బిగించాడు. ఆకుంఠిత దీక్షతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు మహ్మద్ దస్తగిరి. తన షాపునకు ఎవరైనా మటన్ కొనుగోలు చేసేందుకు వస్తే కచ్చితంగా బాక్స్ తెచ్చుకోవాల్సిందేనని చెబుతున్నాడు. తొలిసారి తన దుకాణానికి కస్టమర్లు వస్తే కవర్ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ ఎవరైనా తెచ్చుకోకపోతే మరోసారి కచ్చితంగా బాక్స్ తెచ్చుకోవాల్సిందేనంటున్నాడు.
తొలిసారి కవర్ ఇచ్చినా రెండోసారి మాత్రం మాంసాన్ని కవర్లో పెట్టే ఇచ్చేందుకు మాత్రం ఒప్పుకోడు మహ్మద్ దస్తగిరి. షాపునకు వెళ్లి బాక్స్ తెచ్చుకోవాల్సిందేనని తెగేసి చెబుతాడు. రిక్వెస్ట్ చేసినా మటన్ అమ్మేందుకు మాత్రం ససేమిరా అంటున్నాడు. బాక్స్ లేకపోతే తొలిసారి 40 మైక్రాన్ల కవర్లో మటన్ పెట్టి ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ, ప్రభుత్వం చేస్తున్న ప్లాస్టిక్ రహిత సమాజానికి తన వంతు కృషి చేస్తానని చెప్పుకొస్తున్నాడు. మటన్ షాపు ముందు భాగంలో బ్రింగ్ యువర్ ఓన్ బాక్స్ అంటూ బోర్డు కూడా పెట్టించాడు. మహ్మద్ దస్తగిరి కృషితో షాపునకు వచ్చే 70శాతం కస్టమర్లు బాక్స్ను వెంట తెచ్చుకుంటున్నారు. ప్రతి చికెన్ షాపు, మటన్ షాపుల నిర్వాహకులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని మహ్మద్ దస్తగిరి కోరుతున్నారు. జీహెచ్ఎంసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కలిసి నిర్ణయం ప్లాస్టిక్ రహిత హైదరాబాద్ను చూడవచ్చంటున్నారు.