ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితా- 2018ను ఫోర్బ్స్ విడుదల చేసింది. 75 మందితో కూడిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు మొదటి స్థానం దక్కించుకోగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. వివిధ రంగాల నుంచి శక్తిమంతులైన వ్యక్తుల జాబితా రూపొందించడానికి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. ఎక్కువ మంది వ్యక్తులకు ప్రాతినిథ్యం వహించే దక్షత కలిగి ఉండటం, ఆర్థిక వనరులను నియంత్రించగలగడం, భిన్న రంగాలలో తమ ముద్ర వేయగలగడం, అధికారాన్ని చురుగ్గా వినియోగించుకోగలగడం వంటి అంశాల ఆధారంగా 75 మంది వ్యక్తులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారంటూ ఫోర్బ్స్ ప్రశంసించింది. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్తో జరిపిన చర్చల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడింది. దేశంలోని గ్రామీణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టారంటూ ప్రశంసలు కురిపించింది. 2016లో పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతిని తొలగించేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని ప్రశంసించింది. ‘జియో’తో టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చిన అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ జాబితాలో 32వ స్థానం దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల 40వ స్థానాన్ని ఆక్రమించుకున్నారు.