పార్లమెంట్ సాక్షిగా చెప్పిన హామీలన్నీ అమలు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేశారు. దగాపడిన రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విభజన హామీలపై రెండు రోజుల్లోగా పార్లమెంట్లో స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి డెడ్లైన్ పెట్టారు.
హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలను ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తాను ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు హోదా ద్వారా ఇస్తున్న రాయితీలన్నింటినీ ఏపీకి ఇవ్వాలని ఆనాడే స్పష్టంగా చెప్పానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి, ఎదురుదాడికి దిగితే ప్రజలు క్షమించబోరని అన్నారు.
ఇతర రాష్ట్రాలకు హోదా కింద ఇచ్చే నిధులను ఏపీకి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. విభజన నష్టాలను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చెప్పారు. కీలక సందర్భాలలో హోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరు... ఏంటి ఈ పరిస్థితి అని కేంద్రాన్ని తాను నిలదీశానని చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిందేనని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభజన తర్వాత ఆర్నెళ్లలోపు రైల్వేజోన్ ఇస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని నాలుగేళ్లయినా రైల్వేజోన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. విభజన సమస్యలపై అసెంబ్లీలో ప్రసంగించిన చంద్రబాబు విశాఖలో రైల్వేజోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విభజన హామీల్లో పేర్కొన్నట్టు దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం సాధ్యం కాదని కేంద్రం చెబుతోందని చంద్రబాబు తెలిపారు. ఎందుకు సాధ్యం కాదంటే చెప్పట్లేదని అన్నారు. విభజన హామీ మేరకు దుగరాజపట్నంపోర్టు నిర్మాణం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం ప్రకటించారు.