కె.ఎస్.రవికుమార్.. తమిళంలో బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పేరిది. ఆయన రూపొందించిన తమిళ సినిమాలు తెలుగులోనూ అనువాదమై మంచి విజయం సాధించాయి. అదేవిధంగా టాలీవుడ్లో మూడు స్ట్రయిట్ సినిమాలు చేశారాయన. చిరంజీవి, మీనా జంటగా వచ్చిన 'స్నేహం కోసం'.. నాగార్జున, సిమ్రాన్, రీమాసేన్ హీరోహీరోయిన్లుగా రిలీజైన 'బావనచ్చాడు'.. రాజశేఖర్, నేహా ధూపియా, తులిప్ జోషి ముఖ్య పాత్రల్లో వచ్చిన 'విలన్'.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు. అయితే వీటిలో 'స్నేహం కోసం' ఫరవాలేదనిపించుకుంది కానీ 'బావనచ్చాడు', 'విలన్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కొత్త చిత్రంతోనైనా ఆయన హిట్ కొడతాడో లేదో మరి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో నయనతార, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు.