'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి విజయవంతమైన చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి స్వయానా మేనల్లుడు అయిన సాయిధరమ్.. చాలావరకు వారి పోలికలతో ఉండడంతో అభిమానులకి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన 'జవాన్' విడుదలకు సిద్ధమైంది. మరో వైపు కొత్త చిత్రాలతో బిజీ అవుతున్నాడు సాయిధరమ్.
ఇటీవలే ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టిన సాయిధరమ్.. ఇవాళ్టి నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా.. 'నిజంగా వినాయక్గారితో నేను పనిచేస్తున్న మొదటి రోజు ఇదేనా? మ్..అయితే కల నిజమైందన్నమాట. ఈ అవకాశమిచ్చినందుకు థ్యాంక్యూ సార్' అంటూ ట్విట్టర్లో స్పందించాడు. చిరంజీవితో 'ఠాగూర్', 'ఖైదీ నెం.150' వంటి ఘనవిజయాలను అందించిన వి.వి.వినాయక్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్తోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.