ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సైకిల్ యాత్ర మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. అయితే గాయాన్ని కూడా లెక్క చేయకుండా స్పీకర్ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. కేంద్రం తీరును నిరసనగా ఈ రోజు ఉదయం స్పీకర్ కోడెల సైకిల్ యాత్ర చేపట్టారు. వేలాది మందితో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు యాత్ర కొనసాగనుంది. రేపు నరసరావుపేట, సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల దీక్ష చేయనున్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ప్రతీ ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని స్పీకర్ కోరారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు.