ఇప్పటివరకు అరడజను సినిమాలు చేసినా.. ఒక్కటంటే ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేకపోయింది ప్రగ్యా జైస్వాల్. 'కంచె' చిత్రంతో నటిగా మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమా కారణంగానే ఇప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆ మధ్య నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో ఇలాగే ఛాన్స్ కొట్టేసింది ప్రగ్యా. ఆ సినిమాలో ఆమెది చిన్న వేషమే అయినా.. నాగ్తో ఓ రొమాంటిక్ సాంగ్లో కనిపించి గ్లామర్ ప్రియులను మెప్పించింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో.. ఇక ప్రగ్యాకి పెద్ద సినిమాల్లో ఆఫర్లు కష్టమే అనుకున్నారు. అయితే అనూహ్యంగా.. మెగాస్టార్ చిరంజీవితో జోడీ కట్టే అవకాశం కొట్టేసిందీ ముద్దుగుమ్మ. చిరు 151వ చిత్రంగా రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి'లో ముగ్గురు హీరోయిన్స్లో ఒకరిగా ప్రగ్యా ఎంపికైందని సమాచారమ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాతోనైనా ప్రగ్యా జాతకం మారుతుందేమో చూడాలి.