విజయ్ త్రిపాత్రాభినయంలో 'రాజా రాణి' ఫేమ్ అట్లీ రూపొందించిన తమిళ చిత్రం 'మెర్సల్'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. సమంత, కాజల్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఇవాళ ఈ చిత్రం తమిళ వెర్షన్ టీజర్ విడుదలయ్యింది. మూడు పాత్రల్లో విజయ్ అదరగొట్టేశాడు. అయితే ట్రైలర్ చూసిన వాళ్లంతా ఒకటే మాట అంటున్నారు.
అదేమిటంటే.. కమల్ హాసన్ నటించిన 'అపూర్వ సగోదరగళ్' (విచిత్ర సోదరులు)కి న్యూ వెర్షన్లా ఉందని. తెలుగులోనూ మంచి హిట్ అయిన ఆ సినిమాకి ఇళయరాజా సంగీతం హైలెట్గా నిలిచింది. 'విచిత్ర సోదరులు'లో మరుగుజ్జు పాత్ర ఉంటే.. ఈ సినిమాలో అలాంటిదేమీ టీజర్లో కనిపించలేదు. అయితే ఓ పాత్ర మేజిషియన్ కావడం గమనార్హం. సినిమా విడుదలయ్యాక ఇది ఆ సినిమాకి న్యూ వెర్షనా కాదా అనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది.
అట్లీకి పాత సినిమాలను కొత్తగా రూపొందించడం ఇదే కొత్త కాదు. తన తొలి చిత్రం 'రాజా రాణి'ని మణిరత్నం 'మౌనరాగం'కి న్యూ వెర్షన్లా తెరకెక్కిస్తే.. గత చిత్రం 'తెరి' (పోలీస్)ని విజయ్కాంత్ 'సత్రియన్' (క్షత్రియుడు)కి న్యూ వెర్షన్లా తెరకెక్కించాడు. అన్నట్లు.. ఇవాళ అట్లీ బర్త్డే. అందుకే ఈ టీజర్ని విడుదల చేసింది చిత్ర బృందం. న్యూ వెర్షన్లతో అట్లీ హ్యాట్రిక్ కొడతాడా? లేదా? తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. అన్నట్లు.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా టీజర్ లో ఎక్కడా వారిని చూపించకపోవడం విశేషం.