'పోకిరి' వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సరైన విజయం లేని సూపర్స్టార్ మహేష్బాబుకి బ్లాక్బస్టర్ సక్సెస్ని అందించిన చిత్రం 'దూకుడు'. దర్శకుడు శ్రీనువైట్లతోనూ.. కథానాయిక సమంతతోనూ.. సంగీత దర్శకుడు థమన్తోనూ.. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్తోనూ.. మహేష్ చేసిన మొదటి సినిమా ఇదే.
కుటుంబ విలువలు, ప్రేమ, ప్రతీకారం, హాస్యం.. ఇలా అన్ని అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రం విజయఢంకా మోగించడమే కాదు.. పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఏడు నంది అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ నటుడు (మహేష్బాబు), ఉత్తమ సహాయనటుడు (ప్రకాష్ రాజ్), ఉత్తమ హాస్యనటుడు (ఎమ్మెస్ నారాయణ), ఉత్తమ ఎడిటర్ (ఎం.ఆర్.వర్మ), ఉత్తమ ఫైట్ మాస్టర్ (విజయన్), ఉత్తమ స్క్రీన్ప్లే రైటర్ (శ్రీను వైట్ల).. ఇలా ఏడు నంది పురస్కారాలను సొంతం చేసుకుంది 'దూకుడు'. 2011, సెప్టెంబర్ 23న విడుదలైన 'దూకుడు'.. నేటితో ఆరు వసంతాలను పూర్తి చేసుకుంటోంది.