'ప్రాణం ఖరీదు'.. మెగాస్టార్ చిరంజీవిని తెలుగు తెరకు అందించిన సినిమా ఇది. చిరు సంతకం చేసిన తొలి సినిమా 'పునాది రాళ్లు' అయినా.. తెరపైకి వచ్చిన తొలి చిత్రం మాత్రం 'ప్రాణం ఖరీదు'నే. కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ, రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, రేష్మారాయ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతమందించగా.. జాలాది సాహిత్యంలో వచ్చిన 'ఏతమేసి తోడినా ఏరు ఎండదు' అనే పాట బాగా ప్రజాదరణ పొందింది. 1978, సెప్టెంబర్ 22న విడుదలైన 'ప్రాణం ఖరీదు'.. నేటితో 39 వసంతాలను పూర్తిచేసుకుంటోంది. అంటే.. చిరు నటనకి 39 ఏళ్లు నిండాయన్నమాట.
'ఖైదీ నెం.150'తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం తన 151వ చిత్రాన్ని 'సైరా నరసింహారెడ్డి'గా చేస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా సెల్యులాయిడ్ పైకి వెళ్లనుంది.