మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు 200వ చిత్రం 'మేఘసందేశం'. ఇందులో జయసుధ, జయప్రద హీరోయిన్లుగా నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ దృశ్యకావ్యం.. మంచి విజయం సాధించడమే కాకుండా.. ఎన్నో పురస్కరాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాలుగు జాతీయ అవార్డులను, పలు నంది అవార్డులను సొంతం చేసుకుంది.
ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు (రమేష్ నాయుడు), ఉత్తమ గాయని (పి.సుశీల), ఉత్తమ గాయకుడు (కె.జె.ఏసుదాస్) విభాగాల్లో ఈ చిత్రం జాతీయ పురస్కారాలను సొంతం చేసుకోగా.. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి (జయసుధ), ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ గాయకుడు, ఉత్తమ పాటల రచయిత (దేవులపల్లి కృష్ణశాస్త్రి), ఉత్తమ ఛాయాగ్రాహకుడు (సెల్వరాజ్. పి.ఎన్), ఉత్తమ ఆడియోగ్రఫీ (ఎ.ఆర్.స్వామినాథన్) విభాగాల్లో ఈ చిత్రం నంది అవార్డులను సొంతం చేసుకుంది.
రమేష్ నాయుడు సంగీతంలో పాటలన్నీ శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా 'ఆకులో ఆకునై', 'ఆకాశ దేశాన', 'నిన్నటిదాకా శిలనైనా' పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1983లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్, మాస్కో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు పొందిందీ సినిమా. సెప్టెంబర్ 24, 1982న విడుదలైన అద్భుత దృశ్య కావ్యం 'మేఘసందేశం'.. నేటితో 35 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.