పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ ఎన్ఆర్సీ పై మాత్రం వ్యతిరేకం అని ప్రకటించింది. దీనిపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఎన్ఆర్సీపై తమ పార్టీవ్యతిరేకం అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎన్ఆర్సీకి వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ప్రకటించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించారు. తాము ముస్లీంలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. అయితే ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది.