రాజ్యసభలో జగన్ కేసులను ప్రస్తావించిన కనకమేడల.. ఛైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం
ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసులపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్పై ఉన్న కేసుల విషయం టీడీపీ ఎంపీ కనకమేడల ప్రస్తావించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై 11 అవినీతి కేసులు ఉన్నాయని, కోర్టు విచారణకు హాజరు కాలేనని కూడా ఆయన పిటిషన్ వేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల అన్నారు.
జగన్ పై ఉన్న సీబీఐ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రం పేరు కాని, ముఖ్యమంత్రి పేరు కాని సభలో ప్రస్తావించవద్దని చెప్పారు. కేవలం ఈ అంశం వరకే చర్చ జరగాలని సూచించారు.